Skip to main content

నిజం దాగదు

సీతమ్మ చక్కని చుక్క. పైగా గర్భవతి. అయినా ఆమె మొగుడు ఆమెను చీదరించుకునేవాడు. అత్త-మామ ఇద్దరూ ఆశపోతులు. అడిగినంత కట్నం తేలేదని ఆమెను ఎప్పుడూ తిడుతుండేవాళ్ళు. 'నువ్వు చచ్చిపోతే మా కొడుక్కి మళ్ళీ పెళ్ళి చేస్తాం" అని సాధించేవాళ్ళు. సీతమ్మ ఇవన్నీ భరిస్తూ జీవితాన్ని ఎలాగో ఒకలా నెట్టుకొచ్చేది.
సీతమ్మకు మాంసంకూర అంటే చాలా ఇష్టం. ఒకరోజున అత్త మామ మాంసం కూర చేశారు. తీరా సీతమ్మ తినాలనుకునేసరికి, వాళ్ళు "కందికట్టె పూర్తిగా అయిపోయింది- చేనుకెళ్ళి కందికట్టె తీసుకురా" అని పంపించారు. సీతమ్మ చేనుకు వెళ్ళి తిరిగి వచ్చేలోగా ఆమె అత్త, మామ, భర్త ముగ్గురూ కూరను పూర్తిగా లాగించేశారు. అంతేకాకుండా, రోడ్డుమీద దొరికిన పామునొకదాన్ని ముక్కలు చేసి, దాన్ని వండి పెట్టారు సీతమ్మకోసం!


ఆకలిగా ఉన్న సీతమ్మ పాపం, ఆ పాము చారునే తిన్నది. తినగానే ఆమెకు వాంతులు-బేదులు మొదలయ్యాయి. నాలుగైదు గంటలపాటు ఆమె బాధపడినా అత్తమామలుగాని, భర్తగాని ఆమెను పట్టించుకోలేదు. చివరికి ఊరి చివరనున్న తోటలోకి పరుగెత్తిన సీతమ్మ అక్కడే చనిపోయింది.
"అయ్యో నా భార్య! చనిపోయింది" అని దొంగ ఏడుపులు ఏడిచి, భర్త, అత్త-మామలు కలిసి ఆమెను అక్కడే సమాధి చేసేసి, 'పీడ విరగడైంది' అని సంతోషపడ్డారు. త్వరలోనే ఆ సమాధి మీద చాలా అందమైన పూలు- చేమంతులు, గులాబీలు, గుండుమల్లెలు పూసాయి.
ఈ సంగతంతా తెలీదు, సీతమ్మ తల్లిదండ్రులకు. వాళ్ళు పాపం, సీతమ్మకు శ్రీమంతం చేద్దామని బయలుదేరి వచ్చారు. ఇంకా ఊళ్ళోకి పోకనే వాళ్ళకు ఒక చక్కని తోట కనబడింది. ఆ తోటలో ఒకచోట అందమైన పూలు కనబడితే, సీతమ్మ చెల్లెలు తన అక్క శ్రీమంతం కోసం ఆ పూలు తెద్దామని వెళ్ళింది. ఆమెను చూడగానే అక్కడున్న చేమంతులు
"రావద్దు చెల్లీ!
రావద్దు చెల్లీ!
వస్తే ప్రమాదం చెల్లీ!
పాము తినిపిస్తారు!
వెళ్లిపో చెల్లీ" అని పాడాయి.
సీతమ్మ చెల్లెలు గబగబా వెనక్కి వెళ్ళి వాళ్ల అమ్మతో "అమ్మా! అక్కడ అక్క మాటలు వినబడుతున్నాయి. చేమంతులు ఏమేమో చెబుతున్నై, నువ్వు పోయి చూడు" అన్నది. "పూలు మాట్లాడేది ఏమిటి", అని సీతమ్మ తమ్ముడిని పంపింది వాళ్లమ్మ.
వాడిని చూడగానే చేమంతులు
"రావద్దు తమ్ముడా!
రావద్దు తమ్ముడా!
వస్తే ప్రమాదం తమ్ముడా!
పాము తినిపిస్తారు,
వెళ్ళిపో తమ్ముడా!" అని పాడాయి.
వాడు కూడా వెనక్కి వచ్చాక ఈసారి సీతమ్మ తల్లి స్వయంగా వచ్చి చూసింది. ఆమెను చూడగానే చేమంతులు ఏడుస్తూ
"రావద్దు తల్లీ!
రావద్దు తల్లీ!
వస్తే ప్రమాదం తల్లీ!
పాము తినిపిస్తారు,
వెళ్ళిపో తల్లీ!" అన్నాయి.
వాటి గొంతును గుర్తు పట్టిన సీతమ్మ తల్లి, "అయ్యో! పదండి త్వరగా! సీతమ్మకు ఏదో అయినట్లుంది. వీళ్ళు ఏదో చేసినట్లున్నారు. పోయి చూద్దాం పదండి" అని, అందరినీ వెంటబెట్టుకొని త్వరత్వరగా వెళ్ళింది సీతమ్మ అత్తగారింటికి.
వీళ్లను చూడగానే సీతమ్మ భర్త, అత్త-మామలు అందరికీ పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లైంది. "మా బిడ్డ సీతమ్మ ఏది?" అని అడిగితే వాళ్ళు నీళ్ళు నమిలారు- ఒక్కొక్కరూ ఒక్కో సమాధానం చెప్పారు. సీతమ్మ బంధువులందరికీ మోసం అర్థమైంది. వాళ్లంతా ఆమె భర్తమీద, అత్త మామలమీద పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుననుసరించి పోలీసులు దర్యాప్తు జరిపే సరికి, నిజం బయట పడింది. సీతమ్మ భర్తను, అత్తను, మామను అందరినీ పోలీసులు జైలులో పెట్టారు. దుర్మార్గులకు తగిన శిక్షలే పడ్డాయి.
ఇప్పుడు సీతమ్మ సమాధి చుట్టూ చక్కని పూలతోట ఏర్పడ్డది.
దాని చుట్టూ పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం తయారైంది.
పిల్లలంతా సంతోషంగా ఆడుకుంటుంటే, చేమంతులు పాడుతున్నై-
"రండి రండి పిల్లలూ!
చక్కని పిల్లలూ!
ఆడుకోండి, పాడుకోండి,
మంచి వ్యక్తులుగా ఎదగండి!
కల్లలొద్దు, కపటం వద్దు,
అందరు ఒకటేనండీ!
రండి రండి పిల్లలూ!
ఆడుకోండి పిల్లలూ" అని.

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.