Skip to main content

దురాశ

అనగనగా ఒక ఊరు . ఆ ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని సీతయ్య . ప్రతి రోజూ అతను దగ్గరలోని అడవికి వెళ్ళి, కట్టెలు కొట్టుకొచ్చి, వాటిని గ్రామంలో అమ్మి, తన కుటుంబాన్ని పోషించేవాడు. అంత పేదరికంలో కూడా ఇతరులకు సాయపడేవాడు.
ఒక ఏడాది కరువు వచ్చి పంటలు సరిగ్గా పండలేదు. ఊళ్లో జనాల దగ్గర డబ్బు లు తక్కువ అవ్వటంతో, ఆ ప్రభావం సీతయ్య కట్టెల వ్యాపారం మీద పడింది. కట్టెలు కొనేవాళ్ళ సంఖ్య బాగా తగ్గి పోయింది. సీతయ్య కుటుంబానికి పూట గడవటమే కష్టమైపోయింది.
ఒకనాడు సీతయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. కట్టెలు కొడుతుండగా మధ్యలో దాహం వేసింది. దగ్గర్లోని చెలమకు పోయి, నీళ్ళు తాగి, "అమ్మా! ఎంత కష్టంవచ్చిందమ్మా నాకు!" అని నిట్టూర్ఛాడు. వెంటనే ఒక వనదేవత ప్రత్యక్షమయింది: 'ఏమి కావాలో కోరుకో'మన్నది!
సీతయ్య తన కష్టాలన్నింటినీ ఆ దేవతకు చెప్పుకున్నాడు. అప్పుడు వనదేవత సీతయ్యకు మూడు టెంకాయలు ఇచ్చి "ఈ మూడు టెంకాయలనూ కొడుతూ నువ్వు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది నాయనా" అని చెప్పి మాయమై పోయింది.
సీతయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళి టెంకాయలను కొడుతూ, తనకు ఒక పెద్ద భవనమూ, దండిగా సంపదా, తమ ప్రాంతం మొత్తానికి సకాల వర్షాలు కావాలని కోరుకున్నాడు. అతని కోరిక ప్రకారమే అన్నీ జరిగాయి.
సీతయ్య ఇంటి పక్కనే ఒక పిసినారి పుల్లయ్య ఉండేవాడు. వ్యాపారంలో బాగా సంపాదించి డబ్బులు కూడ బెట్టాడు అతను. అతనికి రెండు గాడిదలు ఉండేవి. అవంటే అతనికి ఎంతో ఇష్టం కూడాను.


కట్టెలుకొట్టే సీతయ్య ఒక్క రోజులో షావుకారి అయిపోవడం పిసినారి పుల్లన్నకు ఆశ్చర్యం కలిగించింది. సీతయ్య దగ్గరికీ వెళ్లి 'విషయం ఏంటి' అని ఆడిగాడు. పుల్లయ్య అంటే గౌరవభావం ఉన్న సీతయ్య, ఏమీ దాచుకోకుండా జరిగినదంతా చెప్పేశాడు అతనికి.
మరుసటి రోజు పిసినారి పుల్లన్న అడవికి బయలు దేరిపోయి, నీటి చెలమ దగ్గర కూర్చొని "అమ్మా! ఎంత కష్టం వచ్చిందమ్మా నాకు!" అని మొత్తుకున్నాడు. వెంటనే వనదేవత ప్రత్యక్షమైయింది; సీతయ్యకు ఇచ్చినట్లే మూడు టెంకాయలను ఇచ్చి మాయమై పోయింది.
పుల్లన్న ఇంటికి వెళ్ళి , మొదటి టెంకాయ కొట్టబోతున్నాడు. అంతలో ఒక బిక్షగాడు వచ్చి ఇంటి బయట నిల్చొని, " బాబూ! ధర్మం బాబూ !" అని అరిచాడు.
"శుభమా , అని టెంకాయ కొడుతుంటే, వీడొకడు తగలబడ్డాడు" అని కోపగించుకున్న పుల్లన్న, కొబ్బరికాయను కొడుతూనే, "నువ్వొక్కడివీ వస్తే ఎలా సరిపోతుంది గాడిదా, మరో వెయ్యి గాడిదల్ని వెంట బెట్టుకు రాకపోయావూ!?" అన్నాడు వెటకారంగా.
టెంకాయ మహత్యం! మరుక్షణం పుల్లన్న ఇల్లంతా గాడిదలతో నిండిపోయింది.
"ఇదేమిటీ, ఇలా జరిగింది?" అని కంగారు పడ్డాడు పుల్లన్న . ఆ కంగారులో రెండవ టెంకాయను కొడుతూ "అమ్మా! ఈగాడిదలన్నింటినీ తీసేసుకోమ్మా!" అన్నాడు. తక్షణం అతని సొంత గాడిదలతో సహా అక్కడున్న అన్ని గాడిదలూ మాయమయ్యాయి.
"అయ్యో! నాప్రియమైన రెండు గాడిదలు! అవి పోతే ఎలా?" అంటూనే మూడవ టెంకాయను కొట్టాడుపుల్లన్న. కళ్లుమూసి తెరిచేసరికి, అతని రెండు గాడిదలూ అతనికి తిరిగి వచ్చేశాయి!
మూడు టెంకాయలు అయిపోయాయి- కానీ వనదేవతవల్ల ఏ లాభమూ పొందలేకపోయాడు, పాపం పుల్లన్న! ఆ తర్వాత అతను ఎంత నిట్టూర్చినా వనదేవత మాత్రం ప్రత్యక్షం కాలేదు

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.