Skip to main content

నిధికి దారి


గోకులనాధుడనే సన్యాసి బొద్దాం గ్రామం మీదుగా వెళుతూ
రచ్చబండ దగ్గర ఆగాడు. గ్రామస్థులను చూసి, 'అంతులేని
నిధినిక్షేపాలను గమనించక దిగాలుగా ఉన్నారేం?' అన్నాడు. ఆ 
మాటలు విని గ్రామపెద్ద త్రిగుణయ్య 'వూరు పనికి రానిదిగా
మారింది. అన్నీ బీడు భూములే. వర్షాలు పడి ఏళ్లయింది. ఇక
నిధి నిక్షేపాలు ఎక్కడివి స్వామీ?' అన్నాడు.
'నా దివ్యదృష్టికి అంతా కనిపిస్తోంది. మీలో ఒకరి కళ్లకు అంజనం
రాస్తే నిధులెక్కడున్నాయో తెలుస్తుంది' అన్నాడు సన్యాసి.
గ్రామస్థులంతా త్రిగుణయ్యకి అంజనం రాయమని కోరారు.
సన్యాసి తన జోలె లోంచి ఓ చిన్న భరిణె తీసి అందులోని
కాటుకని త్రిగుణయ్యకి రాశాడు. త్రిగుణయ్య వెంటనే 'ఆహా!
అద్భుతం. నిధికి దారి స్పష్టంగా కనిపిస్తోంది. తవ్వడమే
తరువాయి' అన్నాడు. ఆ మాటలకు గ్రామస్థులంతా సంబరపడి
పోయి పలుగు, పార, గునపాలు, తట్టలు పుచ్చుకుని తరలి
వచ్చారు. మర్నాడే పని ప్రారంభమైంది.

త్రిగుణయ్య చెప్పిన
చోట తవ్వుకుంటూ గ్రామస్థులు చెమటోడ్చి పని చేశారు. నిధికి
దారి బీడు భూముల మీదుగా వూరికి దాపుల నున్న కొండల మధ్య
నుంచి సాగింది. ఓ చోట చివ్వున జలం వూరి పనికి అడ్డం వచ్చింది.
కొందరి గ్రామస్థుల చేత దాన్ని దారి మళ్లించాడు
త్రిగుణయ్య. ఇలా కొన్నాళ్లయినా నిధినిక్షేపాలు
కనిపించలేదు. గ్రామస్థులంతా ఓ రోజు త్రిగుణయ్యను
చుట్టుముట్టి, 'అసలు నిధికి సరైన దారి ఇదేనా?' అంటూ
మండిపడ్డారు. త్రిగుణయ్య అయోమయంగా మొహం పెట్టి
'పదండి. సంగతేంటో ఆ సన్యాసినే అడుగుదాం' అంటూ వూరందరితో
అడవి లో సన్యాసి దగ్గరకు వెళ్లి నిలదీశాడు.
ఆ సన్యాసి
కాసేపు కళ్లు మూసుకుని 'నేను చెప్పింది అబద్దం కాదు. పదండి
చూపిస్తా' అంటూ ముందుకు నడిచాడు. గ్రామస్థులంతా అనుసరించారు.
'అదిగో చూడండి. మీ తవ్వకాల వల్ల గుక్కెడు నీళ్లు దొరకని
గ్రామానికి జలసంపద లభించింది. బీడు భూములన్నీ
సారవంతమయ్యాయి. రాజధాని నగరానికి కొండల మధ్య నుంచి
దగ్గరి దారి ఏర్పడింది. అన్నింటినీ మించి సోమరులంతా
పనిమంతులయ్యారు. ఇవన్నీ నిధినిక్షేపాలు కావా?' అన్నాడు.
అంతా విన్న వూరి పెద్ద త్రిగుణయ్య 'అయ్యా! మీరు
చెప్పినవన్నీ నిజమే. ఇన్నాళ్లూ బద్దకస్తులమై గ్రామాన్ని
పాడు పెట్టుకున్నాం' అన్నాడు.
గ్రామస్థులంతా సిగ్గుపడి తలలు
దించుకున్నారు. ఆపై అందరూ పొలాలు సాగు చేసుకుని చక్కగా
బతకసాగారు. గ్రామస్థుల సోమరితనాన్ని వదిలించడానికి
సన్యాసి సాయంతో అంజనం నాటకమాడినట్టు త్రిగుణయ్య
ఎవరికీ చెప్పలేదు.

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.